సుడా, జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన చైర్మన్లకు అభినందనలు: కష్టపడిన కార్యకర్తలకు తగిన గౌరవం దక్కుతుందని భరోసా
ఖమ్మం,వి90 న్యూస్,మే 24: స్తంభాద్రి పట్టణాభివృద్ధి సంస్థ (SUDA) నూతన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన పువ్వాళ దుర్గాప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖాదర్ బాబాకు హృదయపూర్వక అభినందనలు వ్యక్తమయ్యాయి. వీరిద్దరూ తమ సుదీర్ఘ అనుభవంతో జిల్లా ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలు అందిస్తూ ప్రాంతీయ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కీలక సంస్థల బలోపేతానికి, వనరుల కొరత లేకుండా చూడటానికి ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని, ఖమ్మం జిల్లా మంత్రులతో పాటు తాము ఎల్లప్పుడూ వీరికి అండగా ఉంటామని స్పష్టం చేశారు.

గత పదేళ్ల కష్టకాలంలో ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ, పార్టీ జెండాను భుజాన వేసుకుని నిలబడిన ప్రతి ఒక్క కార్యకర్తను, నాయకుడిని ఈ ప్రజా ప్రభుత్వం గుర్తుపెట్టుకొని తగిన గౌరవం కల్పిస్తుందని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. నాడు కొందరు నేతలు అవకాశవాదంతో పార్టీ వీడినా, కాంగ్రెస్ను తమ గుండెల్లో పెట్టుకుని కాపాడిన నిఖార్సైన కార్యకర్తల త్యాగాల వల్లే నేడు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం సాధ్యమైందని కొనియాడారు. కార్యకర్తలు పడిన కష్టాన్ని ఈ ప్రభుత్వం ఎన్నటికీ మరువదని, రాబోయే రోజుల్లో వారందరికీ సముచిత స్థానం దక్కుతుందని పునరుద్ఘాటించారు.

