పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్యుడిపై మోయలేని భారం: కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ మండిపాటు
విజయవాడ, వి90 న్యూస్, మే 24: ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం బడ్జెట్ సాక్షిగా పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ పన్నులను భారీగా పెంచి, సామాన్య, మధ్యతరగతి ప్రజల నడుం విరిచిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కామరాజ్ హరీష్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లీటర్ పెట్రోల్, డీజిల్పై అదనంగా రూ. 4 నుండి చొప్పున భారం మోపడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆయన విజయవాడలో ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో ‘బాదుడే బాదుడు’ అంటూ ఆకాశమే హద్దుగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు, ఈరోజు ప్రజలపై అసలైన బాదుడును మొదలుపెట్టారని విమర్శించారు. సూపర్ సిక్స్ హామీల పేరుతో ప్రజలను నమ్మించి, అధికార పీఠం ఎక్కిన తర్వాత ఇలా దొంగచాటుగా పన్నుల భారం మోపడం ప్రజలను నిలువునా వంచించడమే అవుతుందన్నారు.డీజిల్ ధరలు పెరగడం వల్ల రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో పడుతుందని, లారీలు, ఆటోలు, ప్రైవేటు వాహనాల నిర్వహణ ఖర్చులు పెరిగి తద్వారా పాలు, కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక చేత్తో ఉచిత గ్యాస్ సిలిండర్ అంటూ ప్రచారం చేసుకుంటూ, ఇంకో చేత్తో పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచి వంటింటి బడ్జెట్ను అస్తవ్యస్తం చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని దుయ్యబట్టారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సామాన్య ప్రజలపై ఇలాంటి అదనపు పన్నుల భారాన్ని ఎప్పుడూ మోపలేదని, సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో నడిపించారు తప్ప ఇలా ప్రజల రక్తాన్ని పీల్చలేదని కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఒకే ఒక్క బడ్జెట్తో ప్రజల నెత్తిన భారీ బండను పెట్టిందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ప్రజల పక్షాన రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని కామరాజ్ హరీష్ కుమార్ హెచ్చరించారు.
