ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై వేధింపులను తక్షణమే అరికట్టాలి: ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ డిమాండ్
రంగారెడ్డి, వి90 న్యూస్, మే 24: దేశంలోనే గర్వించదగ్గ సీనియర్ పాత్రికేయుడు, విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వరరావును ఆంధ్రప్రదేశ్కు చెందిన కొందరు వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురిచేయడాన్ని ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొడ్డు శ్రీధర్ తీవ్రంగా ఖండించారు. పార్టీలకతీతంగా, సమాజంలోని అన్ని ప్రజాసంఘాల మద్దతుతో ఎమ్మెల్సీగా గెలిచి ప్రజాసేవ చేసిన గొప్ప రాజకీయ జ్ఞాని ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని ఆయన కొనియాడారు. అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా, రాజ్యాంగం మరియు దేశ చట్టాల పరిధిలో ఉంటూ సిద్ధాంతపరమైన, విశ్లేషణాత్మకమైన విమర్శలు చేస్తూ అంతిమంగా ప్రజలకు మేలు జరగాలనే గొప్ప సంకల్పంతో ఆయన ప్రతినిత్యం పనిచేస్తున్నారని పేర్కొన్నారు.ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏనాడూ బయటకు వచ్చి తాను ఫలానా కులానికి చెందినవాడినని చెప్పుకోలేదని, కులాన్ని కేవలం ఇంటికే పరిమితం చేసి సమాజమే తన కులంగా బతుకుతున్న ఒక నిష్కల్మషమైన వ్యక్తిని వేధించడం సమాజానికే మంచిది కాదని బొడ్డు శ్రీధర్ హితవు పలికారు. ఇలాంటి మేధావిని, విశ్లేషకుడిని లక్ష్యంగా చేసుకుని మానసిక వేధింపులకు గురిచేయడం అత్యంత దురదృష్టకరమన్నారు. ఈ ఉదంతంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, సామాజిక మాధ్యమాల్లో ఆయనపై అసత్య ప్రచారాలు చేస్తూ వేధింపులకు గురిచేస్తున్న అల్లరి మూకలను గుర్తించి వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
