పెన్షన్ ఫైల్ క్లియర్ చేసేందుకు రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా చిక్కిన ప్రభుత్వ పాఠశాల రికార్డు అసిస్టెంట్
హైదరాబాద్ వి90న్యూస్ మే 25: హైదరాబాద్ అమీర్పేటలోని ప్రభుత్వ పాఠశాలలో రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తున్న ఎస్. శివానంద్ అనే ఉద్యోగి ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఒక రిటైర్డ్ ఉద్యోగికి సంబంధించిన పెన్షన్ ఫైల్ను ముందుకు కదిలించేందుకు, క్లియర్ చేసేందుకు గాను శివానంద్ ఇరవై వేల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. దీనిపై బాధితుడు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు అమీర్పేటలో నిఘా పెట్టారు. పథకం ప్రకారం బాధితుడి నుంచి శివానంద్ రూ.20,000 నగదు లంచం తీసుకుంటుండగా అధికారులు దాడి చేసి రికార్డు అసిస్టెంట్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, కేసు నమోదు చేసి శివానంద్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ అవినీతి వ్యవహారంపై మరింత సమాచారం కోసం అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

