కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన పాలకుర్తి ఇరిగేషన్ డీఈ శ్రీకాంత్

0
IMG-20260525-WA0023

జనగాం,వి90 న్యూస్, మే 25: జనగాం జిల్లా పాలకుర్తి ఇరిగేషన్ శాఖలో డివిజనల్ ఇంజనీర్ (డీఈ)గా విధులు నిర్వహిస్తున్న గంటి శ్రీకాంత్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. పది డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన ఫైనల్ బిల్లులను క్లియర్ చేసేందుకు గాను డీఈ శ్రీకాంత్ ఒక కాంట్రాక్టర్ నుంచి యాభై వేల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. బిల్లులు సకాలంలో మంజూరు కావాలనే ఉద్దేశంతో సదరు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఏసీబీ అధికారులు హన్మకొండ భవానీ నగర్‌లోని డీఈ శ్రీకాంత్ నివాసం వద్ద నిఘా పెట్టారు. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల బిల్లుల కోసం లంచం సొమ్ము రూ.50,000 నగదును కాంట్రాక్టర్ నుంచి శ్రీకాంత్ తీసుకుంటుండగా అధికారులు మెరుపు దాడి చేసి ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి నుంచి లంచం డబ్బును స్వాధీనం చేసుకున్న అధికారులు, ప్రస్తుతం ఆయన ఇంట్లో ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో మరిన్ని కీలక పత్రాలు, అక్రమాస్తుల వివరాలు లభ్యమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed