సీపీఎం నేత సామినేని రామారావు హత్య కేసు నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సీపీఎం రాష్ట్ర బృందం వినతి, సానుకూలంగా స్పందించిన సీఎం
హైదరాబాద్, వి90న్యూస్,మే 25: ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సీపీఎం రాష్ట్ర నాయకుడు సామినేని రామారావును అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేసి, చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీఎం రాష్ట్ర బృందం సోమవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేసింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జగ్గుల జాన్ వెస్లీ ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా నాయకత్వంతో పాటు రామారావు సతీమణి సామినేని స్వరాజ్యం ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఈ మేరకు విన్నవించగా, ముఖ్యమంత్రి వెంటనే సానుకూలంగా స్పందించారు. గత ఏడాది అక్టోబర్ 31న పాతర్లపాడు గ్రామానికి చెందిన బొర్రా ప్రసాద్, కంచుమర్తి రామకృష్ణ, మద్దినేని నాగేశ్వరరావు, కాండ్ర పిచ్చయ్య, కొత్తపల్లి వెంకటేశ్వర్లు తదితరులు రాజకీయ కక్షతో, ముందస్తు కుట్రపన్ని రామారావును కత్తులతో పొడిచి కిరాతకంగా చంపేశారని ఆ వినతిపత్రంలో నేతలు పేర్కొన్నారు. రామారావు బతికుంటే పాతర్లపాడులో సీపీఎంను ఓడించడం సాధ్యం కాదనే ఉద్దేశంతోనే ఈ దారుణానికి ఒడిగట్టారని వివరించారు. హత్య జరిగి ఏడు నెలలు గడుస్తున్నా, ఈ ఘోరాన్ని స్వయంగా చూసిన రామారావు భార్య స్వరాజ్యం నిందితుల పేర్లతో చింతకాని పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చినప్పటికీ పోలీసులు నేటికీ వారిని అరెస్ట్ చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.సామినేని రామారావు నిస్వార్థ ప్రజానాయకుడని, పాతర్లపాడు గ్రామానికి రెండుసార్లు ఏకగ్రీవ సర్పంచ్గా సేవలందించడమే కాకుండా, తన సొంత స్థలాన్ని పేదల ఇండ్ల స్థలాల కోసం పంచిన మహోన్నత చరిత్ర ఆయనదని ముఖ్యమంత్రికి వివరించారు. సీపీఎం జిల్లా, రాష్ట్ర నాయకుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సుమారు 50 సంవత్సరాల పాటు ప్రజా ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేసిన రామారావు ఎదుగుదలను ఓర్వలేకనే సంఘ విద్రోహ శక్తులు ఈ కుట్రకు పాల్పడ్డాయని నేతలు పేర్కొన్నారు. కాబట్టి ఈ కిరాతక హత్యకు పాల్పడిన హంతకులను, దీని వెనుక ఉన్న సూత్రధారులను వెంటనే అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి. జ్యోతి, పోతినేని సుదర్శన్ రావు, మల్లు లక్ష్మి, తీగల సాగర్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు తదితరులు ఉన్నారు.

