పెద్దపల్లిలో అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న 6 టిప్పర్ల సీజ్: కౌన్సిలర్ల తనిఖీల అనంతరం రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు
పెద్దపల్లి ,వి90 న్యూస్, మే 25: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న ఆరు టిప్పర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుడి సమీపం గుండా వెళ్తున్న మట్టి లారీలను స్థానిక 16వ వార్డు కౌన్సిలర్ నాంసాని శ్రీనివాస్తో పాటు బొంకురి అవినాష్ అడ్డుకొని ప్రాథమికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్నట్లు గుర్తించి సమాచారం అందించడంతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు.

పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్ వద్ద డిప్యూటీ తాసిల్దార్ విజేందర్ నేతృత్వంలో మొత్తం 21 టిప్పర్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఎలాంటి రవాణా ధ్రువీకరణ పత్రాలు (పర్మిట్లు) లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్నట్లు తేలడంతో ఆరు మట్టి టిప్పర్లను అధికారులు అక్కడికక్కడే సీజ్ చేశారు. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మట్టి తరలిస్తే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు హెచ్చరించారు.

