హుజురాబాద్ డంప్ యార్డ్ రద్దుపై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలి: సీడీఎంఏ శ్రీదేవికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వినతి
హైదరాబాద్,వి90 న్యూస్,మే 26: హుజురాబాద్ నియోజకవర్గంలోని సిర్సపల్లి గ్రామంలో ప్రతిపాదించిన డంప్ యార్డ్ ఏర్పాటును తక్షణమే రద్దు చేస్తూ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లో సీడీఎంఏ శ్రీదేవిని కలిసిన ఆయన, డంప్ యార్డ్ రద్దు చేయాలని కోరుతూ ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే, డంప్ యార్డ్ రద్దు కోసం స్థానిక ప్రజలు, జేఏసీ నాయకులు, వివిధ ప్రజాసంఘాలు గత కొంతకాలంగా నిరసనలు, నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడం విచారకరమన్నారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి డంప్ యార్డ్ ఏర్పాటు చేయాలని చూడటం పూర్తిగా ప్రజా వ్యతిరేక చర్య అని ఆయన విమర్శించారు.ఈ ప్రతిపాదిత డంప్ యార్డ్ కారణంగా పరిసర గ్రామాల్లో గాలి, నీరు, భూమి పూర్తిగా కాలుష్యమయమై, చెత్త నుంచి వచ్చే విషవాయువుల వల్ల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు శ్వాసకోశ సమస్యలతో పాటు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. అలాగే వ్యవసాయ భూములు నాశనమై, భూగర్భ జలాలు కలుషితమై రైతులు తీవ్రంగా నష్టపోతారని వివరించారు.ప్రజల ఆవేదనను, జేఏసీ నాయకుల విన్నపాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని, ఇప్పటివరకు స్పష్టమైన జీవో లేదా అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడం వెనుక ఉన్న అంతర్యమేమిటో అర్థం కావడం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, భవిష్యత్తు, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రజలకు ఇబ్బంది లేని ప్రత్యామ్నాయ ప్రదేశాన్ని పరిశీలించాలని సీడీఎంఏను కోరారు. ప్రభుత్వం గనుక తక్షణమే స్పందించకపోతే హుజురాబాద్ ప్రజలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.

