పిట్టలవాడలో 24 గంటల్లోనే తాగునీటి సమస్య పరిష్కారం: అప్రమత్తంగా వ్యవహరించి నీటి ఎద్దడి తప్పించిన కౌన్సిలర్ యాట్ల సునీత అశోక్
జమ్మికుంట,వి90 న్యూస్,మే 26: స్థానిక పిట్టలవాడలో తలెత్తిన తాగునీటి సమస్యను కౌన్సిలర్ యాట్ల సునీత అశోక్ మున్సిపల్ అధికారుల సహకారంతో కేవలం 24 గంటల వ్యవధిలోనే పరిష్కరించి వార్డు ప్రజల ప్రశంసలు అందుకున్నారు. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా హై వోల్టేజ్ కరెంటు రావడంతో స్థానిక బావి మోటార్, దానికి సంబంధించిన స్టాటర్ పూర్తిగా కాలిపోయాయి. దీంతో వార్డుకు నీటి సరఫరా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడటాన్ని గమనించిన కౌన్సిలర్, తక్షణమే రంగంలోకి దిగారు. సమస్య తీవ్రత దృష్ట్యా ఆమె వెంటనే మున్సిపల్ కమిషనర్ గట్టుల మల్లికార్జున స్వామి, ఏఈ వికాస్ తో ఫోన్ లో మాట్లాడారు. మున్సిపల్ వాటర్ సిబ్బందిని అత్యవసరంగా పిలిపించి, కాలిపోయిన మోటార్ను విప్పించి రిపేరుకు పంపించారు.

మోటార్ బాగుపడే లోపు వార్డు ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు అధికారులతో మాట్లాడి వెంటనే మున్సిపల్ వాటర్ ట్యాంకర్లను తెప్పించారు. కాలిపోయిన మోటార్ను రాత్రికి రాత్రే యుద్ధప్రాతిపదికన రిపేరు చేయించి, కేవలం 24 గంటల్లోనే మళ్లీ యధావిధిగా బావి ద్వారా నీటి సరఫరాను పునరుద్ధరించారు. వార్డులో నీటి సమస్య రాకుండా వేగంగా స్పందించి సహకరించిన మున్సిపల్ కమిషనర్ గట్టుల మల్లికార్జున స్వామి కి, ఏఈ వికాస్ కి, కౌన్సిలర్ యాట్ల సునీత అశోక్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే క్షేత్రస్థాయిలో శ్రమించిన ఫిట్టర్ స్వామి, వాటర్ బాయ్ పురుషోత్తం , ఇతర మున్సిపల్ సిబ్బందిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఒకే ఒక్క రోజులో తాగునీటి సమస్యను తీర్చడంతో వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

