శామీర్పేట తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు: లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా చిక్కిన ఎమ్మార్వో సుచరిత
మేడ్చల్ మల్కాజిగిరి,వి90 న్యూస్,మే 26: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు జరిపిన మెరుపు దాడులు జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. భూమి నాలా (NALA) కన్వర్షన్ చేయడానికి గానూ రూ. 30 లక్షల భారీ లంచం డిమాండ్ చేసిన శామీర్పేట ఎమ్మార్వో సుచరిత, అందులో భాగంగా తొలి విడతగా లంచం సొమ్మును తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. బొమ్మరాసిపేట పరిధిలోని భూముల క్లియరెన్స్ కోసం ఆమె ఈ అక్రమ వసూళ్లకు తెరలేపినట్లు సమాచారం.ఈ వ్యవహారంలో ఎమ్మార్వో మరికొందరు ఉన్నతాధికారులతో చేతులు కలిపి సదరు భూములను క్లియర్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాధిత వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పక్కా వ్యూహంతో దాడి చేసిన ఏసీబీ బృందం, లంచం డబ్బులు తీసుకుంటుండగా ఎమ్మార్వో సుచరితను ఆమె ప్రైవేట్ డ్రైవర్తో సహా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. అనంతరం కార్యాలయంలో సుదీర్ఘంగా సోదాలు నిర్వహించిన అధికారులు కేసు నమోదు చేసి, దానికి సంబంధించిన పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ అవినీతి ఉదంతం రెవెన్యూ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

