ఉద్యమకారుల గుర్తింపు, గౌరవమే ప్రభుత్వ లక్ష్యం: తెలంగాణ ఉద్యమకారుల కమిటీ తొలి సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, కేకే
హైదరాబాద్, వి90న్యూస్, మే 30: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, వారికి దక్కాల్సిన సముచిత గౌరవం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ తొలి సమావేశం నేడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఘనంగా జరిగింది. కమిటీ ఛైర్మన్ డాక్టర్ కె. కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్, మాజీ ఎమ్మెల్సీ ఎస్. రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డితో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యమ క్షేత్రంలో పోరాడిన ప్రతి ఒక్కరిని గుర్తించి, వారికి సముచిత గౌరవం కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు.రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన సుదీర్ఘ పోరాటంలో వివిధ వర్గాల పాత్ర ఎనలేనిదని ఈ సమావేశంలో నేతలు కొనియాడారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, మేధావులు, కళాకారులు, రచయితలతో పాటు ముందుండి నడిచిన ఉద్యోగులు, విద్యార్థులు, ఆర్టీసీ మరియు సింగరేణి కార్మికులు సహా ఉద్యమంలో భాగమైన వారందరి వివరాలను అత్యంత పారదర్శకంగా సేకరించనున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయి నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించి, ఎలాంటి పక్షపాతం లేకుండా అర్హులైన వారందరితో కూడిన సమగ్ర జాబితాను రూపొందిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ స్వరాష్ట్ర సాకారం కోసం విశేష కృషి చేసిన ప్రతి ఒక్క ఉద్యమకారుడికి తగిన గుర్తింపు, గౌరవం దక్కేలా ఈ కమిటీ పూర్తి బాధ్యతతో పనిచేస్తుందని ఈ సందర్భంగా వారు భరోసా ఇచ్చారు.

