చదువు ఎవరూ దోచుకోలేని విలువైన సంపద: మహిళా వారోత్సవాల్లో మంత్రి సీతక్క
రంగారెడ్డి,వి90 న్యూస్,మే 30: చదువు అనేది ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం మాత్రమే కాదు, ఎవరూ దోచుకోలేని విలువైన సంపద మరియు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చే అత్యంత విలువైన ఆస్తి అని రాష్ట్ర మంత్రి సీతక్క పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన మహిళా వారోత్సవాల కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జీవితంలో పెళ్లి అయినా, వృద్ధాప్యం వచ్చినా చివరి వరకు మనతో తోడుగా ఉండేది కేవలం మనం నేర్చుకున్న చదువు, విజ్ఞానమేనని స్పష్టం చేశారు. విద్యకు వయసుతో నిమిత్తం లేదని, ప్రతి ఒక్కరూ నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.మహిళా వారోత్సవాల్లో భాగంగా టీనేజ్ బాలికల కోసం ఏర్పాటు చేసిన మాక్ పార్లమెంట్, నిరక్షరాస్యులైన తల్లుల కోసం ఉద్దేశించిన ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమాలను వారు ప్రారంభించారు. అదేవిధంగా, వేసవి సెలవుల అనంతరం అంగన్వాడీ కేంద్రాలు తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో అక్కడి చిన్నారులకు ప్రభుత్వం తరఫున యూనిఫాం దుస్తులను మంత్రి సీతక్క, ఎమ్మెల్యే యాదయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. మహిళలు, బాలికల సాధికారతకు, చిన్నారుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా వారు పునరుద్ఘాటించారు.

