జమ్మికుంట నాయిని చెరువు పరిసర ప్రాంత పనులపై ఇరిగేషన్ ఎస్ఈతో మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్ ప్రత్యేక భేటీ
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,మే 31: జమ్మికుంట పట్టణ పరిధిలోని నాయిని చెరువు పరిసర ప్రాంతాల్లో డ్రైన్ నిర్మాణం చేపట్టే విషయమై ఇరిగేషన్ ఎస్ఈ రాజ్ కుమార్ ని మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న వర్షాకాలంలో పట్టణంలోని వరద నీరు నాయిని చెరువులోకి వెళ్లకుండా, అలాగే చెరువు నుండి వచ్చే మత్తడి నీరు వరదనీరు కాలువలోకి ప్రవహించకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఈ సందర్భంగా చర్చించారు. ప్రస్తుతం నాయిని చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులతో కలిపి ఈ డ్రైన్ నిర్మాణాన్ని కూడా చేపట్టాలని గతంలో జిల్లా కలెక్టర్ గారిని కోరగా, వారు సానుకూలంగా స్పందించి ఇరిగేషన్ ఎస్ఈకి సిఫారసు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ , మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి , ఏఈ వికాస్ తో కలిసి ఎస్ఈ రాజ్ కుమార్ ని ప్రత్యేకంగా కలిసి పనుల ఆవశ్యకతను వివరించారు. దీనిపై ఇరిగేషన్ ఎస్ఈ సానుకూలంగా స్పందిస్తూ, నాయిని చెరువు పరిసర ప్రాంత డ్రైన్ నిర్మాణం కోసం తమ శాఖ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారని మున్సిపల్ చైర్మన్ పేర్కొన్నారు.

