పెద్దంపల్లిలో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం: ప్రారంభించిన సర్పంచ్ ఏగీత పద్మ కుమార్
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 01: జమ్మికుంట మండలం పెద్దంపల్లి గ్రామంలో పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసే ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిర్మించిన నూతన గృహప్రవేశ కార్యక్రమం పండగ వాతావరణంలో ఘనంగా జరిగింది. గ్రామానికి చెందిన దొడ్డే నర్సమ్మ పేరుపై మంజూరైన ఈ ఇందిరమ్మ ఇంటిని గ్రామ సర్పంచ్ ఏగీత పద్మ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి సాంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడిన తమ కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇల్లు అందించి, ఆత్మగౌరవంతో బతికేలా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి , ముఖ్యమంత్రికి లబ్ధిదారురాలు దొడ్డే నర్సమ్మ కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ వేడుకలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ ప్రధాన ఆశయమని స్పష్టం చేశారు. పేద ప్రజలు గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలనే లక్ష్యంతోనే ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని, ఇది నిరుపేదలకు ఒక వరం లాంటిదని వారు పేర్కొన్నారు. ఈ సంతోషకరమైన కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ నాగరాజు, పంచాయతీ కార్యదర్శి ప్రదీప్, వార్డు సభ్యులు మారపల్లి రాజయ్య, దొడ్డే లావణ్య, గణపతి, అఖిల, తిరుమల, రాజేష్లతో పాటు గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు , కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన గృహ ప్రవేశం చేసిన నర్సమ్మ కుటుంబానికి తమ శుభాకాంక్షలు అందజేశారు.

