తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం: జమ్మికుంటలో బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, జూన్ 02: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జమ్మికుంట పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముందు పండుగ వాతావరణంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేసి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ వేడుకల్లో పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు, కౌన్సిలర్ శీలం శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు జీడి మల్లేష్ గార్లు పాల్గొని ప్రసంగించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 1969లోనే మొదటి దశ ఉద్యమం పెద్ద ఎత్తున జరిగిందని, ఆనాడు 369 మంది అమాయకులు ప్రాణాలు అర్పించారని వారు గుర్తు చేశారు. మలిదశ ఉద్యమంలో సైతం దాదాపు పన్నెండు వందల మంది యువకులు, విద్యార్థులు తమ ప్రాణాలను త్యాగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ క్లిష్ట సమయంలో ‘తెలంగాణ చిన్నమ్మ’గా పేరుగాంచిన అప్పటి లోకసభ ప్రతిపక్ష నేత, స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకు బిజెపి పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించి, తెలంగాణ ప్రజల్లో కొండంత భరోసా నింపారని కొనియాడారు. బిజెపి పార్టీ చొరవ, మద్దతు లేకుండా తెలంగాణ కల సాకారం అయ్యేది కాదని, రాష్ట్ర ఏర్పాటులో తమ పార్టీ కీలక పాత్ర పోషించిందని వారు స్పష్టం చేశారు. 1999లోనే బిజెపి ‘ఒక ఓటు రెండు రాష్ట్రాలు’ అనే నినాదంతో తెలంగాణకు మద్దతుగా నిలిచిందని, ఆ తర్వాత 2013లో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు పూర్తి స్థాయిలో సహకరించి తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను నిజం చేసిందని గుర్తు చేశారు.ఇదే సమయంలో ప్రాంతీయ, జాతీయ పార్టీల వైఫల్యాలపై వారు తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ సెంటిమెంట్ను అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని, ప్రజలను దోచుకుందని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అధికారంలోకి రావడం కోసం అడ్డగోలుగా హామీలు ఇచ్చిందని, ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఆ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు, నిరుపేదలకు, నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే అది ఒక్క బిజెపి అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు.ఈ ఘనమైన కార్యక్రమంలో బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శులు కైలాసకొటి గణేష్, రాచపల్లి ప్రశాంత్, సీనియర్ నాయకులు టంగుటూరి రాజ్ కుమార్, ఆడువాల కుమార్, కేస స్వరూప, కొండ్లె నగేష్, సతీష్, ఆకుల తిరుపతి, పోచయ్య పాల్గొన్నారు. వీరితో పాటు యువ మోర్చా అధ్యక్షులు తుర్పాటి శంకర్, మహిళా మోర్చా అధ్యక్షురాలు గంగాభవాని, ఇటుకాల స్వరూప, లక్ష్మి, పల్లపు రవి, మైనారిటీ మోర్చా అధ్యక్షులు నసీరుద్దీన్, అప్పం మధు, బూత్ అధ్యక్షులు ఉడుగుల మహేందర్, వెంకట్రాజం, అప్పాల రవిందర్, బొజ్జ శరత్, ఆవుల తిరుపతి యాదవ్, యాంసాని సమ్మయ్య తదితర ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

