జమ్మికుంట మున్సిపాలిటీలో బదిలీపై వెళ్లిన అధికారులకు ఘన వీడ్కోలు: శాలువాలతో సత్కరించిన చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్, కమిషనర్ మల్లికార్జున స్వామి
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 02: గత కొన్ని సంవత్సరాలుగా జమ్మికుంట మున్సిపాలిటీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి, సహాయ సహకారాలు అందించిన మున్సిపల్ అధికారులకు కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు పలికారు. బదిలీపై వెళ్తున్న సీనియర్ అసిస్టెంట్ జె. వాణి, శానిటరీ ఇన్స్పెక్టర్ పి.పి. మహేష్లను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్), మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామిలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జమ్మికుంట పట్టణంలో ఇంటి పన్నుల వసూళ్లలోనూ, పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంలోనూ వాణి, మహేష్లు అందించిన సేవలు ఎంతో ప్రశంసనీయమని కొనియాడారు. వారిద్దరూ తమ విధుల్లో చూపిన ప్రతిభ, నిబద్ధత మున్సిపాలిటీ ప్రగతికి ఎంతగానో తోడ్పడిందని అభినందించారు.

ఈ వీడ్కోలు సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మహమ్మద్ ముంతాజ్ అలీ జావేద్, మేనేజర్ జి. రాజిరెడ్డి, జె.ఎ.ఓ. రాజశేఖర్ రెడ్డి, టి.పి.ఎస్. రాజ్ కుమార్, ఆర్.ఐ. భాస్కర్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ పాల్గొని బదిలీపై వెళ్తున్న అధికారులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. వీరితో పాటు పలువురు మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు , కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై సహోద్యోగులకు ఘనంగా వీడ్కోలు పలికారు.

