జమ్మికుంటలో ముందస్తు వరద నివారణ పనులు: ప్రజలకు ఇబ్బందులు లేకుండా మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ప్రత్యేక చర్యలు
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 03: రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని జమ్మికుంట పట్టణ ప్రజలకు, రైతులకు వరద నీటి వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. పట్టణ పరిధిలోని పలు వార్డుల్లో వర్షపు నీరు సాఫీగా సాగిపోయేలా కచ్చా కాలువలు తీసే పనులను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) జేసీబీలతో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసినప్పుడు ధర్మారం, కొత్తపల్లి ప్రాంతాల్లోని గృహ సముదాయాలు, వ్యవసాయ భూములు మునిగిపోకుండా ఉండేందుకు ప్రైవేట్ జేసీబీలను లీజుకు తీసుకుని ధర్మారంలో అత్యవసరంగా ఈ పనులను మొదలుపెట్టినట్లు వివరించారు.

తమ మున్సిపల్ పాలకవర్గం బాధ్యతలు చేపట్టి మూడు నెలలు పూర్తయిందని, పట్టణ ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చైర్మన్ తెలిపారు. తమ పాలకవర్గం అనునిత్యం పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంటూ, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ పోలు దివ్య బిక్షపతి, పాపి రెడ్డి తదితరులు పాల్గొని పనులను పర్యవేక్షించారు.

