తెలంగాణకు భారీ వర్ష సూచన..18 జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసిన ఐఎండీ!
హైదరాబాద్ ,వి90న్యూస్, జూన్ 03: నైరుతి రుతుపవనాలు గురువారం నాటికి కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, తెలంగాణలో వాతావరణం వేగంగా మారుతోంది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.
ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది.
ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
పలు జిల్లాల్లో అప్పుడే మొదలైన వర్షాలు
మంగళవారం నాడే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలంలో అత్యధికంగా 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 4 సెం.మీ, ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో 1.7 సెం.మీ వర్షం పడింది.
ఒకవైపు వర్షాలు.. మరోవైపు ఎండలు
రాష్ట్రంలో ఒకవైపు వర్ష సూచన ఉన్నప్పటికీ, మరోవైపు ఎండల తీవ్రత కొనసాగుతూనే ఉంది. మంగళవారం రాష్ట్రంలోని 27 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40.2 డిగ్రీల నుండి 44.7 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. రాబోయే రెండు రోజులు ప్రజలు ఉరుములు, మెరుపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

