జమ్మికుంటలో జూన్ 4 నుంచి వార్డ్ సభల నిర్వహణ: మున్సిపల్ కమిషనర్ జి. మల్లికార్జున స్వామి
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 03: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జూన్ 4, 6, 8, 10 తేదీలలో వార్డ్ సభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ జి. మల్లికార్జున స్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వార్డ్ సభల నిర్వహణపై మున్సిపల్ చైర్పర్సన్ ఎం. ప్రశాంత్ కుమార్ (దిలీప్), కమిషనర్ జి. మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో వార్డ్ అధికారులతో ఒక ప్రత్యేక సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వార్డుల్లోని స్థానిక ప్రజలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, ఈ సభలను విజయవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సభల షెడ్యూల్ వివరాలను పరిశీలిస్తే, జూన్ 4వ తేదీన వార్డ్ నంబర్లు 12, 19, 20, 23, 24, 26 లలో సభలు జరుగుతాయి. అనంతరం జూన్ 6వ తేదీన వార్డ్ నంబర్లు 1, 4, 6, 10, 28, 29 లలోనూ, జూన్ 8వ తేదీన వార్డ్ నంబర్లు 5, 7, 13, 17, 18, 22, 25, 27, 30 లలోనూ ఈ సభలను నిర్వహిస్తారు. చివరిగా జూన్ 10వ తేదీన వార్డ్ నంబర్లు 2, 3, 8, 9, 11, 14, 15, 16, 21 లలో వార్డ్ సభలు ముగుస్తాయని మున్సిపల్ యంత్రాంగం స్పష్టం చేసింది.ముఖ్యంగా ఈ వార్డ్ సభలలో ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు-2026 అమలు, జల్ సంచయ్ – జల్ భాగీదారి కార్యక్రమంలో భాగంగా వర్షపు నీటి నిల్వ (రైన్ వాటర్ హార్వెస్టింగ్) నిర్మాణాల ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. వీటితో పాటు డ్రైన్ల పూడికతీత, రాబోయే రుతుపవనాల సన్నద్ధతకు కార్యాచరణ ప్రణాళిక, సురక్షిత త్రాగునీటి సరఫరా, దోమల నివారణకు పారిశుధ్య చర్యలు, వీధి దీపాల ఏర్పాటు, రోడ్ల నిర్వహణ, మొక్కల పెంపకం వంటి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలతో పాటు స్థానిక ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై విస్తృతంగా చర్చిస్తారు. ఈ సన్నాహక సమావేశంలో మున్సిపల్ మేనేజర్ జి. రాజారెడ్డి తో పాటు వివిధ వార్డుల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

