తారుపల్లి స్కూల్ అసిస్టెంట్ ఎం.డి. ఖాద్రి పదవీ విరమణ వేడుక ఘనంగా నిర్వహణ: పలువురు ప్రముఖుల ప్రశంసలు
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 03: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం తారుపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా సుదీర్ఘ కాలం సేవలందించి పదవీ విరమణ పొందిన ఎం.డి. ఖాద్రి సన్మాన సభ జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్స్లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ బీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దబ్బెట రవీందర్ , హుజూరాబాద్ డివిజన్ అధ్యక్షులు బండి ప్రభాకర్ , రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, రిటైర్డ్ ఉపాధ్యాయులు కందాల రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, ఖాద్రి తన 30 సంవత్సరాల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవా కాలంలో ఎంతో మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చడమే కాకుండా, తారుపల్లి పాఠశాల సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు శ్రమించారని కొనియాడారు. విద్యా రంగంలో ఆయన అందించిన సేవలు అంకితభావానికి నిదర్శనమని, రాబోయే తరాల ఉపాధ్యాయులకు ఆయన ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు. ఈ వేడుకలో ఎం.డి. ఖాద్రి ని విద్యా రంగానికి ఆయన చేసిన సేవలను స్మరిస్తూ శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో కేడీసీసీ వైస్ చైర్మన్ పింగిలి రమేష్ , 28వ వార్డు కౌన్సిలర్ ఒగ్గు రమేష్ తో పాటు విద్యా రంగ ప్రముఖులు ఎం.డి. అంకుష్, ఏ. శ్రీనివాస్, ఎన్. రమాదేవి, కరుణాకర్, సీహెచ్. బాబయ్య, గై సంపత్ , ఇతర సహోద్యోగ ఉపాధ్యాయులు, మిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరంతరం విద్యార్థుల భవిష్యత్తు కోసం తపించిన ఖాద్రి పదవీ విరమణ అనంతరం కూడా ఇదే ఉత్సాహంతో సమాజ సేవలో చురుకుగా పాల్గొంటూ శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని పలువురు ఆకాంక్షించారు.

