బంగాళాఖాతంలో భూకంపం: విశాఖపట్నంలో ప్రకంపనలు, భయాందోళనలో ప్రజలు
ఆంధ్రప్రదేశ్/విశాఖపట్నం/వి90న్యూస్ జూలై 12: ఆదివారం తెల్లవారుజామున బంగాళాఖాతంలో సంభవించిన భూకంపం కారణంగా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం, ముఖ్యంగా విశాఖపట్నం నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉదయం 5:05 గంటల సమయంలో విశాఖలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. నగరంలోని గాజువాక, మంగళపాలెం, పెదవాల్తేరు, ఆరిలోవ, తాటిచెట్లపాలెం, మురళీనగర్ వంటి పరిసర ప్రాంతాలలో నివాసితులు ఈ ప్రకంపనలను స్పష్టంగా గుర్తించారు. తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా మంచాలు కదలడం, ఇళ్లలోని పాత్రలు, వస్తువులు కిందపడటంతో ఏం జరుగుతుందో తెలియక జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వెంటనే ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు.నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ సమాచారం ప్రకారం, ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.5గా నమోదైంది. కాకినాడకు తూర్పుగా దాదాపు 227 కిలోమీటర్ల దూరంలో, బంగాళాఖాతం సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం (ఎపిసెంటర్) కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూకంప కేంద్రం సముద్రంలో ఉండటం వల్లే తీరప్రాంతంలో కేవలం ప్రకంపనలు మాత్రమే వచ్చాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఈ హఠాత్ పరిణామంతో విశాఖ, పరిసర ప్రాంతాల ప్రజలు కాసేపు ఆందోళనకు గురైనప్పటికీ, ప్రస్తుతానికి ఎలాంటి ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం సంభవించలేదని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. సముద్రంలో భూకంపం వచ్చినప్పటికీ సునామీ వంటి ప్రమాదాలేవీ లేవని, తీరప్రాంత ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దని మరియు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే, తీరప్రాంత రక్షణ సిబ్బంది, విపత్తు నిర్వహణ శాఖ అలర్ట్ అయ్యి పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు.

