సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
వేధింపులకు పాల్పడితే 498-ఏ కింద క్రిమినల్ కేసు ఖాయం
న్యూఢిల్లీ,వి90 న్యూస్,ఆగస్టు 03: సహజీవనం (లివ్-ఇన్ రిలేషన్షిప్)లో ఉన్న భాగస్వామిని వేధింపులకు గురిచేస్తే భారత శిక్షా స్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 498-ఏ కింద క్రిమినల్ కేసు నమోదు చేయవచ్చని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వివాహం కాలేదనే నెపంతో భర్త స్థానంలో ఉన్న వ్యక్తి, భాగస్వామిని వేధించిన ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి వీలులేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటిశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇలాంటి కేసుల్లో బాధితురాలికి చట్టపరమైన రక్షణ కల్పించకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రసాదించిన సమానత్వ హక్కుకు విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. సహజీవనం చేస్తున్న పురుషుడిని కూడా భర్తతో సమానంగా పరిగణించవచ్చని వెల్లడించింది. అయితే పెళ్లి చేసుకుంటానని నమ్మించి, సహజీవనం చేస్తూ హింసకు పాల్పడే వ్యక్తులకు మాత్రమే ఈ సెక్షన్ 498-ఏ వర్తిస్తుందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా స్పష్టమైన వివరణ ఇచ్చింది.

