విజయవాడలో ఘనంగా “చాట్రోన్ కి గూంజ్” విద్యార్థి గర్జన.. మెంబర్షిప్ అవేర్నెస్ ప్రారంభం
విజయవాడ,వి90 న్యూస్,జూన్ 30: దేశంలోని విద్యా వ్యవస్థను పటిష్టపరచడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ (NSUI) శ్రేణులు కదంతొక్కాయి. ఇందులో భాగంగా మంగళవారం విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ (SRR & CVR) ప్రభుత్వ జూనియర్ కళాశాల వేదికగా “చాట్రోన్ కి గూంజ్” విద్యార్థి గర్జన – స్టూడెంట్ ఇంట్రాక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ఎం. నాగమధు యాదవ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రామారావు, ఎన్ఎస్యూఐ స్టేట్ కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్ తదితరులు కళాశాల విద్యార్థులను నేరుగా కలిసి, సంస్థ సభ్యత్వ నమోదుపై ప్రత్యేక అవగాహన (మెంబర్షిప్ అవేర్నెస్) కల్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ఎం. నాగమధు యాదవ్ మాట్లాడుతూ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విద్యార్థుల పక్షాన నిలబడి దేశంలో వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీలపై గళమెత్తుతున్నారని కొనియాడారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు కొత్త ఉద్యోగాలు కల్పించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆపబోదని ఆయన స్పష్టం చేశారు.అనంతరం ఎన్ఎస్యూఐ స్టేట్ కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులను, నిరుద్యోగ యువతను విద్యా మరియు నిరుద్యోగ సమస్యలపై చైతన్యవంతం చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. ఇందులో భాగంగా విజయవాడ నగర వ్యాప్తంగా రాబోయే 40 రోజుల పాటు నిరంతరాయంగా ఈ “చాట్రోన్ కి గూంజ్” విద్యార్థి గర్జన స్టూడెంట్ ఇంట్రాక్షన్ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రతి విద్యాసంస్థలోని విద్యార్థుల సమస్యలను తెలుసుకుంటూ వారిని భాగస్వామ్యం చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ విజయవంతమైన కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నగర స్థాయికి చెందిన ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అలాగే పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని మద్దతు తెలిపారు.

