జపాన్లో భారీ భూకంపం: 7.1 తీవ్రతతో కుదిపేసిన ప్రకంపనలు.. సునామీ హెచ్చరికలు జారీ
టోక్యో,వి,90 న్యూస్,జూలై 28: జపాన్ను మరోసారి భారీ భూకంపం తీవ్రంగా కుదిపేసింది. దక్షిణ కుమామోటో ప్రిఫెక్చర్లో మంగళవారం రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో భూప్రకంపనలు నమోదైనట్లు జపాన్ వాతావరణ సంస్థ (జేఎంఏ) వెల్లడించింది. భూకంప ప్రభావంతో సముద్రంలో సుమారు 3.28 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడే అవకాశం ఉండటంతో అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా దక్షిణ క్యుషు ద్వీపంలోని కుమామోటో, నాగసాకి, కగోషిమా, ఫుక్యోకా, సాగా, ఓయిటా, మియాజాకి ప్రిఫెక్చర్లకు ప్రభుత్వం అత్యవసర హెచ్చరికలను జారీ చేసింది.భూకంప తీవ్రతకు ఇళ్లు, భవనాలు ఒక్కసారిగా పక్కకు ఊగడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై వీధుల్లోకి పరుగులు తీశారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా షింకన్సెన్ హై-స్పీడ్ రైళ్లతో సహా పలు రవాణా సేవలను నిలిపివేసినట్లు రైల్ ఆపరేటర్ జేఆర్ క్యుషు తెలిపింది. అయితే, ఈ భూకంపం వల్ల సమీపంలోని సెందై, జెన్కై అణు విద్యుత్ కేంద్రాలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని క్యుషు ఎలక్ట్రిక్ పవర్ స్పష్టం చేసింది.భౌగోళికంగా అత్యంత ప్రమాదకరమైన ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రాంతంలో ఉండటం వల్ల జపాన్లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే 6.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత కలిగిన భూకంపాల్లో దాదాపు 20 శాతం ఇక్కడే చోటుచేసుకుంటాయి.

