ఇంధన పొదుపుతోనే దేశాభివృద్ధి: ప్రజా దర్బార్లో ఎలక్ట్రిక్ స్కూటర్పై వచ్చి స్ఫూర్తి నింపిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
డాక్టర్ BR అంబేద్కర్ కోనసీమ,కొత్తపేట,వి90 న్యూస్,మే 21: డబుల్ ఇంజన్ సర్కార్ నేతృత్వంలో దేశంతో పాటు రాష్ట్రం కూడా అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. రావులపాలెం మండలం కేతరాజుపల్లి గ్రామ పంచాయతీ వద్ద ఆయన గురువారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఎమ్మెల్యే ఒక సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. తన అధికారిక కాన్వాయ్ను పక్కనపెట్టి, స్వయంగా ఎలక్ట్రిక్ స్కూటర్ నడుపుకుంటూ కేతరాజుపల్లి సభాస్థలికి చేరుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇంధన పొదుపు, కర్బన ఉద్గారాల కట్టడితో పాటు పర్యావరణ పరిరక్షణలో కీలకమైన ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రతి ఒక్కరూ పెంచాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సూచించారు.సభలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ.. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండు ఇంజన్ల వేగంతో నడుస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా అధోగతి పాలైందని, ఆ సమయంలో పరిపాలన ఎలా సాగుతుందోనని ఆందోళన చెందామని గుర్తుచేశారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సమర్థతతో ప్రభుత్వాన్ని అద్భుతంగా నడిపిస్తున్నారని, ప్రధాని మోదీ కూడా రాష్ట్రానికి పూర్తి సహకారం అందిస్తున్నారని కొనియాడారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు సాగుతున్నాయని స్పష్టం చేశారు. అనంతరం ప్రజా దర్బార్లో భాగంగా ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. మొత్తం 32 వినతులు రాగా, వాటిలో పలు సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు.

